‘చిత్రపురి’ని అవమానించవద్దు.. ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపండి.. సొసైటీ ప్రసిడెంట్ ఘాటైన స్పందన
సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి హౌసింగ్ సోసైటిలో అక్రమాలు జరిగాయంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ స్పందించింది. సోసైటీపై చేసిన ఆరోపణలపై ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని స్పందించారు. సొసైటీ కోసం కమిటీ ఎంతో నిబద్ధతతో చిత్త శుద్ధితో పని చేస్తుంది ఆయన స్పష్టం చేశారు.
గత 15 ఏళ్లలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ.. 1991లో భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 2005 సంవత్సరంలో మా చేతికి వచ్చింది. అప్పట్లో దాసరి పుట్టిన రోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ. 24 కోట్ల మేర పన్నులు రద్దు చేశారు అని అనిల్ కుమార్ తెలిపారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఆ సమయంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టీ ఒక్కో ఫ్లాట్కు ఎంత రేటు అనే విషయాన్ని వెల్లడించాం. ఫ్లాట్ ఎలాట్మెంట్స్ కమిటీ పరిధిలో జరగదు. కమిటీపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు అన్నారు. నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. MIG, douplex ఇళ్లు ఏడాది డిసెంబర్లో ఇస్తాం అని అనిల్ తెలిపారు.
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో 2019 వరకు ఎలాంటి వివాదాలు, ఉద్యమాలు జరగలేదు. కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి చిత్ర పురి సాధన సమితి ఏర్పాటు చేసి ఆరోపణలు చేస్తున్నారు. సినీ పరిశ్రమతో సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు అని అనిల్ కుమార్ వల్లభనేని ఆరోపించారు. మాపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి లబ్ది పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా కమిటీతో గొడవలు పడుతున్నారు. కస్తూరి శ్రీనివాస్ ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇస్తే ఈ ఉద్యమం ఉండదు అని ఎద్దేవా చేశారు.
కొత్తగా గెలిచిన కమిటీ వ్యవహారాలు అంతా పారదర్శకంగా కొనసాగుతున్నాయి. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే జనరల్ బాడీ మీటింగ్లో చర్చిద్దామని చెప్పాం. కానీ వాళ్ళు ఏదో ఒక కుట్ర పన్ని మీటింగ్ జరగకుండా చేస్తారు. చిత్ర పురి నీ అవమాన పర్చవద్దు అని అనిల్ కుమార్ వల్లభనేని ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications