భీమవరం ఫ్యాన్స్ గొడవ: నష్టపరిహారం పంపిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న భీమవరంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమవరంలో అల్లకల్లోలం సృష్టించారు. వారి ఆగ్రహ జ్వాలల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ గొడవ రెండు వర్గాల అభిమానుల మధ్య తీవ్రరూపం దాల్చడంతో అక్కడ 144 సెక్షన్ విధించే పరిస్థితి ఏర్పడింది.
మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ గొడవ అంశం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది. ఈ సంఘటనపై ఆయన వెంటనే స్పందించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన అభిమానుల వల్ల కలిగిన నష్టాన్ని తాను భరిస్తానని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాత్కాలికి పరిహారంగా భీమవరం ఎస్ఐకు 3లక్షల రూపాయలు పంపించినట్లు తెలుస్తోంది.

తన వల్ల, తన అభిమానుల వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం వాటిల్ల కూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ముందుకు రావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఉదార గుణం మాత్రమే కాదు, మంచి మనసు ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉందని పలువురు ఆయనప్ను పొగిడేస్తున్నారు.
క్షణికావేశంలో ఆగ్రహావేశాలకు గురై విధ్వంసం సృష్టించడంపై అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ మందలించినట్లు తెలుస్తోంది. ఎన్ని మంచి పనులు చేసినా...ఇలాంటి సంఘటనల వల్ల అవన్నీ తుడిచి పెట్టుకుపోతాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సూచించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications